Saturday, October 9, 2010

ఈ కధకి పేరు పెట్టండి..









నగరాన్ని పిండితే రాలినట్లు రోడ్లన్నీ జనమయం. ఎవరి బిజీ లోవాళ్ళు. ఆఫీసులకెళ్ళే వాళ్ళు. పిల్లలని స్కూలుకి, కాలేజీలకి తీసుకుని వెళ్ళేవాళ్ళు, రోడ్లు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తూన్నవాళ్ళు కొబ్బరి బొండాలు, కూరగాయలు, చేపలు, రొయ్యలు అమ్మేవాళ్ళు ఎవరి అవసరాల్లోవారు. రావాల్సిన బస్సు కోసం అసహనంగా అటూ, ఇటూ చూస్తూంది కాజల్. ఎదురుచూసే బస్సు రాకుండా ఎక్కడికి పోతుంది. బస్సు వచ్చేవైపే కాదు, రాని వైపుకూడా చూడటం ఆరాటానికి పరాకాష్ట. అయితే రావాల్సిన బస్సు కంటే వేగంగా ఆమె ఆలోచనలు పరిగెడుతున్నాయి. సరిగ్గా నిన్న ఇదే సమయానికి జరిగిన సంఘటన తన కళ్ళముందు కదలాడింది. .

నిన్న బస్సు కోసం ఎదురు చూస్తూన్నపుడు ఎవరో ఒక ఇరవై, ఇరవైఐదు సంవత్సరాల యువకుడు రోడ్డు క్రాస్ చేస్తూ బైక్ గుద్ది పడిపోయాడు. అందరూ అతన్ని ముందు తిట్టినా తరువాత అతడు గుడ్డివాడని తెలిసి జాలిపడి బైక్ అతన్ని తిట్టారు.

తనకేమీ పట్టనట్లు అతను నవ్వుకుంటూ తను వెయిట్ చేస్తున్న బస్టాప్ దగ్గరకి వచ్చేడు. నెమ్మదిగా నడుచుకుంటూ తనకు దగ్గరగా వచ్చి... ఏవండీ 28 వచ్చిందాండి. అందం, ఆకర్షణ అన్నీ ఉన్న ఇతనికి దేవుడు అన్యాయం చేసాడనిపించింది. ఏవండీ మిమ్మల్నే... ఉలిక్కి పడింది కాజల్...ఇంకా రాలేదండి. నేనూ దానికోసమే వెయిట్ చేస్తున్నాను. రాంగానే మిమ్మల్ని ఎక్కిస్తాను. చాలా ధాక్సండి.. మీకెందుకండి శ్రమ ..నేనెక్కగలను. బస్సు వచ్చినపుడు చెప్పండి చాలు. మీరేమనుకోనంటే ఒక చిన్న మాట..మాలాటి వికలాంగుల మీద సానుభూతి చూపించండం నాకిష్టం ఉండదండి. అది మా ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చుతుందని నా భావన. వీలయినంత వరకూ ఎవరి మీద ఆధార పడకుండా మా పనులు మేము చేసుకోవడంలోనే మాకు తృప్తి ఉంటుందండి.

ఐయామ్ సారి నా గురించి చెప్పనేలేదు కదూ. నా పేరు ఉదయ్. అనాధాశ్రమంలో జీవన ప్రస్థానం మొదలైంది. రైల్వే న్యూకాలనీలో ఉన్న బ్లైండ్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను...మీరు ఏ కాలేజిలొ చదువుతున్నారు. మీరు కాలేజి చదువుతున్నట్లు ఎలా తెలిసిందని అవాక్కయ్యారా ? ఇందులో విచిత్ర మేముందండి. మీరు వాడే పెర్ఫ్యూమ్ కాలేజ్ స్టూడెంట్స్ తప్ప మరెవరూ వాడరు కదా. తను నిజంగానే అవాక్కయింది. నోటమాట రాలేదు. మాట్లాడే అవకాశము రాలేదు. తన నిశ్శబ్దాన్ని ఛేధిస్తూ 28 బస్సు హారన్ మ్రోగింది. చూస్తుండగానే అతను బస్సు ఎక్కడం, తరువాత హడావుడిగా తను ఎక్కడం జరిగిపోయింది. బస్సులో విడివిడిగా కూర్చున్నా ఒకరు మరొకరి గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఆలోచనలో ఉండగానే అతని బస్టాప్ వచ్చింది. తను దిగిపోయాడు.

బస్సు కదిలింది. వెంటనే తను సీట్లోంచి లేచి అంకుల్ కొంచెం స్లో చేయరా నేనిక్కడే దిగాలి. స్టాప్ లో దిగాలమ్మా, ఎక్కడపడితే అక్కడ బస్సాపరు అంటూనే బస్సు స్లో చేసాడు. దిగి వెనక్కి చూసింది. చాలా దూరంలో ఉన్నాడు. మళ్ళీ ఆలోచనలు..... తను దిగాల్సింది మరో రెండు స్టాపుల తర్వాత. మరి ఇక్కడ ఎందుకు దిగింది. అతని గురించా ? అతనితో ఏం మాట్లాడుతుంది తనకే తెలియదు. సెల్ తీసుకుని మాధవికి ఫోన్ చేసి అటెండెంస్ మేనేజ్ చేయమని చెప్పింది. ఇపుడేం చేయాలి. వెనక్కి చూసింది. అతనెవరితోనో మాట్లాడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. తను నడక మొదలు పెట్టింది. దగ్గర కొచ్చేకా...అరె మీరా... మీరిక్కడే దిగారా ? కాలేజ్ కి వెళ్ళలేదాండి.

లేదండి..ఇక్కడ ఒక అంకుల్ వాళ్ళింటికి వెళ్ళాలి. ఆ పని అయిపోయాకా కాలేజికి వెళతాను. తనకి తెలుసు అది అబధ్ధం అని....బహుసా అతనికి కూడా.. అయినా ఎందుకు చెపుతున్నట్లు.. ఆతన్ని చూడంగానే పరిచయం పెంచుకోవాలని ఎందుకనిపించింది. అదీ తెలియదు. ఇరువురు పరిచయాలు చేసుకోంగానే అతని స్కూలు వచ్చేసింది.

బస్సు హారన్ మ్రోగేసరికి ఊహల్లోంచి బయట పడింది. కొంచెం దూరంలో ఉదయ్ ఉన్నాడు. తనొచ్చేవరకూ బస్సు ఆపింది. రోజు ఇలాగే కలుసుకోవడంలో వారి అనుబంధం పెరిగింది.
తను కూడా అనాధే. చిన్నప్పటి నుండి ఒక దాత చదివించాడు. అతను కాస్తా మరణించేసరికి ఆమె చదువు మధ్యలోనే ఆగిపోయింది. వర్కింగ్ విమెన్ హాస్టల్ లో ఉంటూ ఏదో చిన్న షాపులో పార్టైమ్ స్టోర్స్ మేనేజర్ గా పనిచేసుకుంటూ చదువు కుంటుంది.

ఇద్దరికీ కులం, మతం అడ్డుగోడలు లేవు. తల్లి దండ్రుల ఆంక్షలు లేవు. సో... వారి ప్రేమకి ఎల్లలు లేవు. అలాగని ఎవరూ హద్దులు దాటలేదు.

తరచూ పార్కుల్లోనూ బీచ్ ల్లోనూ కలుసుకోవడం వారిని వివాహ బంధానికి దారి తీసింది.

ఒక రోజు....నాకు కళ్ళు వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెప్పారు. నేత్రదాతలకోసం వెతుకుతున్నాను. నాకు చూపు రాగానే మనిద్దరం పెళ్ళి చేసుకుందాం అన్నాడు.

ఆ రోజు రాత్రి కాజల్ కి నిద్రపట్టలేదు. ఎలాగైనా అతనికి చూపు రప్పించాలి. రెండు రోజులు అతన్ని కలవలేదు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసింది. అతని రిపోర్ట్స్ చేతబట్టుకుని నగరంలో ఉన్న కంటి హాస్పటల్స్ చుట్టూ తిరిగింది. మొత్తానికి శంకర్ ఫౌండేషన్ హాస్పటల్ లో అపాయింట్ మెంట్ సాధించింది.

మరో పది రోజుల్లో అతనికి ఆపరేషన్. ఈ విషయం అతనికి చెప్పింది.
తన చీకటి తెరలు తొలగిపోయే రోజుకోసం ఇద్దరూ ఉత్కంఠతో ఎదురుచూసారు.
కళ్ళు వస్తే ఈ లోకంలోని రంగులన్నీ తెలుస్తాయి.
ప్రకృతిలోని అందాలన్నీ చూడగలుగుతాడు.
ఆ ఊహే అతణ్ణి ఉద్వేగపరచింది.
ఆపరేషన్ అవ్వంగానే కళ్ళు తెరచి మొదట తననే చూడాలని అన్నాడు.
ఆపరేషన్ అయ్యింది.
తను కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తన రూపం.. మసక మసకగా క్రమంగా రూపుదిద్దుకుంది.

అతని మనో నేత్రంలో ఆమె రూపం సజీవంగా..... ఎదురుగా.....
పెళ్ళి గురించి అడిగింది..చూద్దాంలే..అప్పుడేనా...తర్వాత మాట్లాడుకుందాం...
డిస్చార్జ్ రోజున అడిగింది...ఆలోచిస్తాన్లే అన్నాడు....
అతనికి దగ్గరగా వచ్చింది.. కళ్ళని ముద్దాడింది....
నా కళ్ళు జాగ్రత్త......అని వెళిపోయింది.....

నగరాన్ని పిండితే రాలినట్లు రోడ్లన్నీ జనమయం. ఎవరి బిజీ లోవాళ్ళు. ఆఫీసులకెళ్ళే వాళ్ళు. పిల్లలని స్కూలుకి, కాలేజీలకి తీసుకుని వెళ్ళేవాళ్ళు, రోడ్లు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తూన్నవాళ్ళు కొబ్బరి బొండాలు, కూరగాయలు, చేపలు, రొయ్యలు అమ్మేవాళ్ళు ఎవరి అవసరాల్లోవారు.

కళ్ళ చుట్టూ ఉండాల్సిన కాటుక (కాజల్) చీకటిని కళ్ళల్లో నింపుకుని....
రావాల్సిన బస్సు కోసం అసహనంగా ఎటో చూస్తూంది కాజల్....

Friday, October 1, 2010

(అ)విశ్రాంత జీవనయానం.....




నిన్న మాస్కూల్లో ఒక టీచర్ రిటైర్ అయ్యారు..తన విశ్రాంతజీవనం మీద ఒక కవిత వ్రాయమని అడిగారు... ఆమె నార్తిండియన్. హిందీ టీచర్. హిందీ లేదా ఇంగ్లీషులో వ్రాస్తానంటే కాదు తెలుగులోనే వ్రాయమన్నారు. ఆ సందర్భంలో ఆమె తరపున నే చదివిన కవిత...


ఈరోజు గంట కొట్టంగానే నాకంటే ముందే
బడి లోకి వెళ్ళాలని ననుతోసుకుంటూ
వెళ్ళిన నా చిన్నారులు
నా స్మృతి వీధుల్లోంచి వెనక్కి వెళిపోతుంటారు...
నా మనో సముద్రంలో ఎగిసిపడిన అలల్ని
ఒకటొకటిగా మోసి నా చేతిలో
విరిగి అరిగిన సుద్దముక్క
విశ్రాంత జీవన కౌగిలిలో కరిగిపోతూంటుంది...
తనువు తారు నలుపైనా
గోడ నిండా పరుచుకుని
అక్షర మల్లియల సుగంధాన్ని
ఎదజల్లిన నల్లబల్ల నాకోసం
తనువంతా కనులై ఎదురుచూస్తూంటుంది...
ఈ దేవాలయ ప్రాంగణంలో
నా పాద ధూళి రేపటి వానలో
తడిసి ముద్దయిపోతుంది...
హాజరు పుస్తకంలో నా చివరి సంతకం
వేల వేల ప్రశ్నల్ని ప్రసవిస్తుంది...
నే కూర్చునే కుర్చీ మీ వైపు
జాలిగా చూస్తూంటుంది.
మీ చెక్కిళ్ళపై ఎండిన కన్నీళ్ళలో
నా రూపం క్రమక్రమంగా కరిగి పోతుంది...
నేను మాత్రం.....
గుప్పెడు జ్ఞాపకాల మూటని
భుజాన్న మోసుకుని వెళిపోతాను..
మధురక్షణాల చిత్తరువులు(ఫోటోలు)
తగిలించిన గోడకి నా రెండు కళ్ళూ ఉరి పోసుకుంటాను..
వీధివెంట వెళ్ళే బడి పిల్లలని చూస్తూ
గుమ్మానికి వేలాడతాను..
విశ్రాంత జీవన యానంలో
మహాప్రస్థానానికి దారి వెతుకుతూంటాను.
మిత్రులారా ఇక సెలవ్......

Thursday, September 2, 2010

అమర శేఖరుడు

ఆయన మనకిక లేరు..అను భావన మన మస్థిష్కాలలో ఇంకా ముద్ర పడకుండానే సంవత్సరం గడిచిపోయింది. బహుసా ఇది అసాధ్యమేనేమో..ఎందుకంటే ఆయనను ఎలా మర్చి పోగలం. అఖిలాంధ్ర ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న ఆయన మనకిక లేరనేది ఒక తీపి అబధ్ధం. నిజానికి మరణం మనుషుల్ని దూరం చేసినా మనసుల్ని దగ్గర చేస్తుంది.
గత సం వత్సరం ఆయన తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిన సందర్భం లో నా బ్లాగులో పోస్టు పునర్ముద్రిస్తున్నాను...
రోజూ కనిపించే
మీరు......
సమాధిలోకి వెల్తున్నపుడు
మీచుట్టూ ఎవరూ ఉండరు
ఎవరూ ఏడ్చినట్లనిపించదు
ఏ ప్రార్ధనలు మీకు వినబడవు
ఎన్నో ప్రశ్నలు మాత్రం
మీ చుట్టూ నాట్యం చేస్తూంటాయి
మీ పార్ధివ శరీరం బూడిదయి పోతూంటే
మీకేమీ బాధనిపించదు...
రెండోరోజుకల్లా మీ ఫోటో
చిరునవ్వుతో మిమ్మల్ని పలకరిస్తుంది...
మీకందరూ కనిపిస్తారు
మీరెవరికీ కనపడరు...
పరామర్శల ముసుగేసుకుని
వచ్చేవారందరూ
ఫోటో ఫ్రేములో బిగించిన
మిమ్మల్నిచూస్తూంటారు
అశ్రునయనాలతో
మీ పిల్లలు మిమ్మల్ని చూస్తూ
వెళిపోతూంటారు...
ఎవరి బిజీ వారిది
మీరేమీ బాధపడినట్లుండరు...
పెరట్లో మీరు నాటిన మొక్కలు
అందమయిన పూలు పూస్తూంటాయి
పిల్లలు వాటినేచూస్తూ
ఆనందపడుతూంటారు
మీకేమీ బాధనిపించదు...
ముసలి చెట్ల స్థానంలో
కొత్త మొక్కలు మొలుస్తూంటాయి
ఈరోజెందుకో
మీరు బాధగా కనిపిస్తున్నారు
పాతసామాన్ల వాడి సంచిలో
ఇరుక్కుపోయిన మీ ఫొటో
మిమ్మల్ని చూసి జాలిపడుతూంటుంది....




Sunday, August 1, 2010

పెళ్ళి పుస్తకం. 15


హిందూ వివాహ ధర్మం మీద గత కొన్ని సమ్వత్సరాలుగా చేసిన అధ్యయనం వలన ఎన్నో విషయాలు తెలిసినవి. అనేక సందర్భాలలో ఈ విషయాలను బంధుమిత్రులతో పంచుకున్నపుడు వారికెంతో ఆశక్తిని కలిగించేవి. చాలామంది మిత్రులు వీటిని పుస్తక రూపమ్లో తీసుకురమ్మని పలు విధాలుగా ప్రోత్సహించారు. కాని నాకెందుకో ఇష్టం కలగలేదు. ముద్రణకి మనసంగీకరించలేదు. ప్రత్యేకమైన కారణమేమి లేదు. అయినా వారి సలహాని త్రోసిపుచ్చలేదు. నే రాసుకున్న నోట్సు, సేకరించిన విషయాలు ఒక క్రమం లో ఉండాలని ఒక చిత్తు ప్రతిని తయారు చేసుకున్నాను. ఇది జరుగుతున్న తరుణమ్లో విదేశాల్లో ఉంటున్న మా అన్నయగారి పాపకి పెళ్ళి కుదిరింది. కాకినాడలో పెళ్ళి . పెళ్ళి పనులు కొన్ని అన్నయ నాకప్పగించాడు. వాటికోసం కాకినాడ, వైజాగ్ తిరుగుతూంటే మా బంధువుల్లో ఒక పెద్దాయన " అవున్రా చిట్టీ నీ మేనకోడల పెళ్ళి కి ఓ చిన్న పెళ్ళి పుస్తకం అచ్చువేయించి అందరకీ పంచవచ్చుకదా " అని సలహా ఇచ్చాడు. ఎందుకో ఆ ఐడియా అద్భుతంగా అనిపించింది. వెంటనే ప్రెస్ వాళ్ళని సంప్రదించి రెం డువేల కాపీలు (జేబులో పెట్టుకునే సైజులో) ముద్రించి పెళ్ళిలో అందరికీ పంచిపెట్టాను.కొన్ని తెలిసినవారికి, మా స్కూలు పేరెంట్స్ కిపంచిపెట్టాను. అందరూ ఎంతో మెచ్చుకున్నారు. ఇది జరిగి మూడు సంవత్సరాలు పైనే అయింది. నాకు తెలియని వాళ్ళు కూడా నాకు ఫోను చేసి మరీ అభినందనలు తెలిపారు. (వాళ్ళకి నా పుస్తకం ఎలా చేరిందో నాకు తెలియదు) అయినా నాకెందుకో తృప్తి కలగలేదు. ఏదో వెలితిగానే ఉండేది. ఇదుగో ఆ సందర్భం లో నా ఫ్రెండ్ మాలతి ఇవన్నీ బ్లాగులో పెట్టమని సలహా ఇచ్చింది. సో అలా గత సంవత్సరం అక్టోబరు నెలలో మొదలయిన ' నా భావనలు ' బ్లాగులో ' పెళ్ళి పుస్తకం ' అనే పేరుతో ఒక వర్గాన్ని మొదలుపెట్టాను. ప్రపంచం నలుమూలలనుండి ఎంతో మంది తెలుగు బ్లాగర్లు అభినందించారు, ఆశీర్వదించారు... అందరికీ పేరు పేరున నెనర్లు. కొందరైతే క్రిస్టియన్, ముస్లిం మత వివాహ ధర్మాలనికూడా వ్రాయమని అడిగారు. ఇది అంతర్లీనంగా నా బాధ్యతని పెంచింది. అంతకంటే ఎక్కువగా వారి సలహా నన్ను ప్రేరేపించింది. అందుకే ఇతర మతాలలో జరిగే వివాహ తంతులగురించి అధ్యయనం మొదలు పెట్టాను. ఈ రెండు నెలల అధ్యయనంలో ఎన్నో ఆశక్తికరమైన విషయాలు తెలిసాయి. అవన్నీత్వరలో మీతో పంచుకుంటాను.

మతమేదయినా వివాహ ధర్మమొకటే ' సహజీవన సౌందర్యం ' . పాశ్చాత్య నాగరికతా మోజులో పడి భారత యువత ఎంతగా భ్ర ష్టుపట్టిపోతుందో మనకి తెలియంది కాదు. ప్రేమ పేరుతో వంచనలు, దురాగతాలు అంతు లేకుండా పోతున్నాయి. భాధ్యతగల్లిన పౌరులే కాదు సమాజంలో హోదా,పరువు వున్నవారు కూడా ఈనాడు వివాహేతర సంబంధాలతో విచ్చలవిడి శృంగారాన్నిఇపుడు ఒక స్టేటస్ గా భావిస్తున్నారు. సర్వత్రా నైతిక విలువలు లోపిస్తున్నాయి.
యావత్ ప్రపంచం లోనే అత్యధిక యవశక్తి ఉన్నదేశం మన భారతదేశం. యువత సన్మార్గం లో నడుచుకుంటే భారతదేశాన్ని మించిన మరొ దేశం ఈ ప్రపంచం లో ఉండదంటే అతిశయోక్తి కాదు.

సంఘమ్లో సదాచారాలను, సాంఘిక న్యాయాన్ని విశ్వజనీనంగా ఏర్పాటుచేసి సువ్యవస్థను రూపొందిచిన వారు మన పూర్వీకులు. ప్రపంచం లో ఎక్కడా లేని వివాహ సంస్కృతి మనది. భిన్న కుటుంబం లో పుట్టి, భిన్న వాతావరణం లో పెరిగి, భిన్న అలవాట్లను, అభిప్రాయాలను కలిగి ఉన్న ఇద్దరు మనుషులను ఒక పసుపు తాడు ప్రేమానురాగాలతో ఆ జన్మాంతం కట్టిపడేసే పటిష్టమైన వివాహ బంధం మనది. మన పూర్వీకులు మనకందించిన ఈ సంస్కృతీ సంప్రదాయాలను మన ముందుతరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిది.
భారతీయ వివాహ పధ్ధతి యందలి పవిత్రత, గౌరవం , ఆశయం, ఆదర్శం ప్రపంచమందలి మరి ఏ యితర దేశమందుగాని, మతమునందుగాని గాన జాలము. ....అనిబిసెంటు.

Saturday, May 22, 2010

పెళ్ళి పుస్తకం మళ్ళీ తెరవరూ...

స్కూటీ డిక్కీలో మర్చిపోయిన పుస్తకాలు తెచ్చుకుందామని సెల్లార్ లోకి వెళ్ళాను. ఐదవ ఫ్లోర్ పార్వతి గారు వారి మరిది పెళ్ళి విషయాలు చెపుతుంటే అర గంట ఇట్టే గడిచిపోయింది. స్కూలుం టే అసలు ఖాళీ ఉండదు. ఎవరయినా మాట్లాడితే ముక్తసరిగా మాట్లాడి వచ్చేసిదాన్ని. ఇపుడు సెలవులు కాబట్టి ఎవరయినా మాట్లాడితే కాసేపు వారితో గడిపి మరీ వస్తున్నాను. పిల్లలిద్దరూ మా ఆడపడుచు ఇంటికి వెళ్ళారు. ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంది. తలుపు తాళం తీసి ఇంట్లో అడుగు పెట్టేసరికి సెల్ మోగుతూంది. గబగబా వెళ్ళి సెల్ అందుకున్నాను. సామంత్ నా స్టూడెంట్
సాయంత్రం తనూ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికి వస్తారంట నేను ఇంట్లో ఉంటానా లేదా అని ఫోన్ చేసాడు. తప్పకుండా రమ్మని చెప్పాను.
సామంత్ చాలా మంచి స్టూడెంట్. కష్టపడి చదువుతాడు. స్కూల్ టాపర్ కూడా. ఒక్క చదువే కాదు. అన్ని పోటీలలోనూ టాపరే. వాళ్ళ ఫాదర్ రియల్ ఎస్టేట్ బిజినెస్. కోటీస్వరుల కుటుంబం. అయినా సామంత్ చాలా వినయంగా ఉంటాడు.
ఇంటర్ కం లో్ వాచ్ మేన్ కి ఫోన్ చేసి వాళ్ళొస్తే పైకి పంపమని చెప్పాను. సాయంత్రం ఐదున్నరయ్యేసరికి కాలింగ్ బెల్ మోగింది. వాళ్ళే వచ్చారనుకుని టి.వి. కట్టేసి తలుపు తెరచి చూస్తే పనిమనిషి నర్సమ్మ. తను పని చేస్తూంటే ఉల్లిపాయలు అవి కోసి వాళ్ళకి పకోడీలు వేద్దామని పిండి కలిపి ఉంచుకున్నాను. నర్సమ్మ వెళ్ళకుండానే సామంత్, ఖదీర్, వినయ్ వచ్చారు.
గుడ్ ఈవినింగ్ మేడం :
గుడ్ ఈవినింగ్ వెల్ కం..రండి కూర్చోండి. నిలబడే ఉన్నారు.
నో..నో ఫార్మాలిటీస్. ఇక్కడ మీరు స్టూడెంట్స్ కాదు.
చెప్పండి. ఏంచేస్తున్నారు. ఏమైనా సమ్మర్ కోర్సులకి అటెండవుతున్నారా ?
నో..మేడం. ఊరికెళ్ళాం మేడం.. సామంత్ అన్నాడు.
ఒ.కె. ఒన్ మినిట్..
కిచెన్ లోకి వెళ్ళి నర్సమ్మకి పకోడీలు వేయమని చెప్పి వచ్చి కూర్చున్నాను.
ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ . ముగ్గురూ మూడు మతాలకు చెందిన వారైనా చాలా క్లోజ్ గా ఉంటూ అన్ని పండగలూ సెలబ్రేట్ చేసుకుంటూంటారు.
ఊ. చెప్పండి రేపే కదా రిజల్ట్స్ .
ఔను మేడం టెంషన్ గా ఉంది వినయ్ అన్నాడు.
టెంషన్ దేనికి. మీరు బాగా వ్రాసారు. మార్కులు కూడా బాగా వస్తాయి.
ఏ కాలేజీలో జాయిన్ అవుదామనుకుంటున్నారు?
ఇంకా ఏమి డిసైడ్ చేసుకోలేదు మేడం. డాడీ రిజల్ట్సు వచ్చాకా చూద్దాం అన్నారు.. ఖదీర్ అన్నాడు.
గుడ్ డెసిషన్..
నర్సమ్మ పకోడీలు తెచ్చింది. తీసుకోండి.
ముగ్గురూ మొహమాట పడి పోతున్నారు.
ఇవన్నీ ఎందుకు మేడం. వినయ్
నో..చెప్పానుగా మీరిక్కడ స్టూడెంట్స్ కాదని..తీసుకోండి.
మీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా?
అందరూ బాగున్నారు..మేడం. సామంత్ కి నా దగ్గర చనువెక్కువ. తనంటే నాకు అభిమానం కూడా.
మేడం మీరేమను కోనంటే ఒక చిన్న రిక్వెస్ట్ మేడం.
చెప్పు సామంత్..
ఏం లేదు మేడం. మీరీమధ్య మీ పెళ్ళి పుస్తకం ఎపిసోడ్స్ ఏమీ పెట్టలేదు.
మా పేరెంట్స్ కూడా నన్నడిగారు.
అదా..మరేమ్లేదు.. నీకు తెలుసుకదా..మీ అంకుల్ ఈ మధ్య చాలా బిజి అయిపోయారు.
ఎక్కువ టూర్స్ కి వెళ్ళాల్సి వస్తూంది.
ఇంటిపని, పిల్లల ఎగ్జాంస్, అంతేకాదు నీకుతెల్సు కదా ఇల్లు కట్టుకుంటున్నాం ..
ఆ పని కూడా నేనే చూసుకోవాల్సివస్తూంది.
వీటన్నిటితో కొంత వీలుపడక పోస్ట్ చేయలేకపోయాను. త్వరలో స్టార్ట్ చేస్తాను.
మేడం. మాక్రైస్తవ మతం లోని వివాహాన్నిగురించి కూడా రాస్తానన్నారు. వినయ్ అన్నాడు.
తప్పకుండా వినయ్...అంతేకాదు..ఖదీర్ మీ మతం లోని వివాహ ఆచారాలను కూడా రాయబోతున్నాను.
ధాంక్స్ మేడం. ఖదీర్ అన్నాడు.
అంతే మేడం ఇది అడుగుదామనే వచ్చాం. మీరు ఫీలయితే సారీ మేడం. సామంత్.
నో..నో మీరింత అభిమానంగా వచ్చినందుకు, నా బాధ్యత గుర్తుచేసినందుకు నేనే ధాంక్స్ చెప్పాలి.
ముగ్గురూ ధాంక్స్ చెప్పి వెళి పోయారు.
పెళ్ళి పుస్తకం మళ్ళీ తెరవరూ...అన్నట్టుగా వారి చూపులు నన్ను చుట్టుముట్టాయి.
నేను తరవాతి ఎపిసోడ్ గురించి ఆలోచనలో పడిపోయాను.

Thursday, April 22, 2010

ప్రపంచ పుస్తక దినోత్సవ విశేషాలు ...


ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం.
పాఠకుల్లారా ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం గా పరిగణించడానికి విభిన్న కధనాలున్నా చాలా మంది ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన కొన్ని అంశాలు.
1. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అను రచయితలు 1616 ఇదే రోజున మరణించారు.
2. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజున మరణించడమో, జన్మించడమో జరగడం విశేషం.
3. ఇదే రోజున సెయింట్ జార్జ్ జన్మదినాన్ని స్పెయిన్ లో జరుపుకుంటారు. ఇప్పటికీ స్పెయిన్ లో ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని గిఫ్ట్ గా ఇస్తారు.
ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రోజును1995 లో యునెస్కో ప్రపంచ పుస్తక దినం గా ప్రకటించిండమేకాదు, ప్రపంచ పుస్తక మరియు కాపీ హక్కుల దినం గా జరపాలని, రచయితలను, ప్రచురణకర్తలను, పాఠకులను, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అంతర్జాలం, మీడియా కొంతవరకూ పుస్తకం మనుగడను అడ్డుకుంటున్నాయి. అందుకే..
పుస్తకాన్ని కొందాం. పుస్తకాన్ని బ్రతికించుకొందాం.
యుకె లోను ఐర్లాండులోను ప్రపంచ పుస్తక దినం ఒక ఘనమైన వేడుకగా జరుపుకుంటారు. ఆన్ లైన్లో రచయితలు తమ రచనలను చదివి వినిపిస్తారు. పాఠశాలలలో పుస్తక పఠనా పోటీలు నిర్వహిస్తారు. వీటినే రీడథాన్ (Readathon) అనడం విశేషం. అమెరికాలోనైతే వేల కొలది ఇ-బుక్ లను నెట్ లో పెట్టి వాటిలో కొన్ని పుస్తకాల మీద బడి పిల్లలకు ఏక్సలరేటెడ్ రీడింగ్ అనే కాంపిటీషన్ పెడతారు. (ఈ కాంపిటీషన్ ని ఈ సమ్వత్సరం మా స్కూలులో ప్రవేశ పెడుతున్నాం.)
అయితే కొన్ని దేశాలలో ఈ వేడుకను వేర్వేరు రోజుల్లో జరుపుకోవడం విశేషం. ఇది ఇంకా భారతదేశం లో అంత ప్రాచుర్యమ్లోకి రాలేదు.
అసలు ఏ పుస్తకమైనా ఎందుకు చదువుతాం. ఏం అనుభవం లోకి వస్తుంది. ఏ భావనలకు లోనవుతాం. ఏ రకమైన భావోద్రేకాలు ఎలా ఉత్ధాన స్ఠాయికి చేరుకుంటాయి. పుస్తకం లోకి నడవడమంటే... పరిచయ పాత్రలలోకి మనల్ని మనం వంపుకుంటామా ? లేదా మనలని రచయిత తనలో వంపు కుంటాడా? ఇది చాలా చక్కగా బొల్లోజు బాబా గారు తన బ్లాగులో ఒక కవితలో అంటారు..

పుస్తకం లోకి నడవడమంటే.....
ఎప్పుడో, ఎక్కడో, ఎవరో
ఒకడు
దోసెడు అక్షరాల్ని
కాలానికి అర్ఘ్యమిస్తాడు.
పిడికెడు ఆలోచనల్ని ఒడిసిపట్టుకొని
పుస్తకపుటలపై చల్లుతాడు.

ఎప్పుడో, ఎక్కడో, ఎవరో
ఒకడు
ఆ పుస్తకాన్ని తెరుస్తాడు.

ఒక జీవనది వాని గుండెల్లోకి
ప్రవహించటం మొదలౌతుంది.

ఒక సంగీతమేఘం
తేనె పాటల్ని వర్షిస్తూంటుంది.

ఆ రాగ స్పర్శకు వాని మనోయవనికపై
ఓ అపరిచిత అరణ్యం మొలకెత్తుతుంది.
వేన వేల స్వప్నాల పిట్టలు
రివ్వుమంటో ఎగిరి వచ్చి
మనో వనాన వాల్తాయి.
వసంతపు మొగ్గలు
పువ్వులుగా బద్దలవుతాయి.
పరిమళపు భ్రమరాలు ఝుమ్మంటో
వాడిని చుట్టుముడతాయి.

దివా సంధ్యలు, గెలుపోటములు,
సుఖ, దు:ఖాలు, రాగ ద్వేషాలు
అనుభూతి తరువులపై వాలిన
జంట పిచ్చుకలౌతాయి.

కెలడియోస్కోపులో ని
రంగురంగు గాజుముక్కలల్లే
అవే అక్షరాలు అసంఖ్యాక చిత్రాల్ని
ఆవిష్కరిస్తూంటాయి.

ఒక నన్నయ, ఒక వేమన, ఒక గురజాడ
లిప్తపాటు మెరిసి మాయమవుతారు.

నవరసాలూ వాటి దేహాల్ని లాక్కొచ్చి
కనుల వాకిట నిలిపి
రసావిష్కరణ జరిపిస్తాయి.

శత సహస్త్ర శిరఛ్ఛేద
ఖడ్గ పరిహాసం తళుక్కుమంటుంది.

తరాల్ని కలిపే రుధిరామృతం
కాల రేఖ పై లీలగా జారుతుంది.
*************

ఏదైనా ఓ పుస్తకంలోకి నడవటమంటే
పరిచిత పాత్రలలోకి
మనల్ని మనం ఒంపు కోవటమే కదా!

బొల్లోజు బాబా
బాబా గారికి కృతజ్ఞతలతో

Friday, April 2, 2010

బాల పాఠకులందరికీ...

ఈనాడు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.
బాల పాఠకులందరికీ శుభాకాం క్షలు. . ఎలెక్ట్రానిక్ మీడియా, వీడియో గేంస్ ఎంతో ప్రబావం చూపుతున్న ఈ కాలం లో కూడా పిల్లలకి కధల పుస్తకాలంటే ప్రాణం. మీడియా ప్రభావం వలన మిగిలిన సాహిత్యం కాస్త కుంటుపడిందని అనక తప్పదు. నిజానికి ఇటువంటి పరిస్థితులలో బాల సాహిత్యం, వ్యక్తిత్వ వికాస సాహిత్యం మాత్రమే ప్రపంచం లో నిలదొక్కుకోగలిగిందని చెప్పవచ్చు. ఇదంతా వేరే విషయం.
ఇంతకీ ఈ బాలల పుస్తకదినోత్సవం ఎలా మొదలయింది. దీనికో చిన్న కధ ఉంది.
ఫెయిరీ టేల్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. అయితే ఈ ఫెయిరీ టేల్స్ సృష్టికర్త " హాన్ స్ క్రిష్టియన్ ఆండర్సన్ " డెన్మార్క్ లో పుట్టిన ఈయన 1805-1875 మధ్య నివశించాడు. ఈయన రాసిన అనేక కధలలో .. ద లిటిల్ మెర్మైడ్, ద స్నో క్వీన్, ద ప్రిన్సెస్ అండ్ ద పీ మరియు థంబులీన్
చాలా ప్రాచుర్యం పొందాయి. అంతేకాదు ఈయన రాసిన జానపద కధలు 150 భాషల్లోకి అనువదింపబడ్డాయి. అంతేనా..ఎన్నో ఏనిమేషన్ చిత్రాలు, పిల్లల నాటికలకు, సినిమాలకు ప్రేరణని ఇచ్చాయి. మరి ఈ రోజెందుకు బాలల పుస్తక దినోత్సవం ఎందుకు జరుపుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఆండర్సన్ ( ఏప్రిల్ 2 ) గారి పుట్టిన రోజు కాబట్టి. మరో విశేషం ఏమంటే ఈరోజు ఆయన 205 వ జయంతి. ఈ దినోత్సవ ఉద్దేశ్యం ఏమంటే బాలలలో పఠనాసక్తిని పెంపొందించడమే..
ఈ రోజుని మా స్కూల్ లో చాలా బాగా జరుపుకున్నాం. సం.రం. అంతా మా పిల్లలు చదివిన పుస్తకాల పేర్లు ఒక డైరీ లో రాసుకుంటారు. ఈ రోజున పేరెట్స్ ని పిలిచి వారెదురుగా పిల్లలు వారు చదివిన పుస్తకాలలో వానికి నచ్చిన కధని అందరికీ చెపుతారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులే న్యాయనిర్ణేతలు గా వ్యవ హరించి బాగా చెప్పిన పిల్లలని ఎంపిక చేస్తారు. వారికి బహుమతులివ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ విషయమేమంటే
కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులు చాలా మంది పిల్లల కధల పుస్తకాలు తెచ్చి మిగిలిన పిల్లలకి పంచి పెట్టారు. ఈ విద్యాసం వత్సరమ్లో ఈ ఉత్సవాన్ని మరింత వెరైటీగా ఎంత వెరైటీ అంటే భారతదేశమ్లో మరే ఇతర స్కూలు జరపలేనంతగా జరపాలని ప్రణాళిక లు సిధ్ధం చేసేసాం.
ఎలా అనుకుంటున్నారా... అమ్మో ఇపుడు చెప్పను... బై.