Tuesday, December 29, 2009

ఎందుకని...?

ఈ బాధని, వేదనని
ఎందుకు నింపుతావు నాలో
నన్ను నీలో ఎపుడో వంపుకున్నానే..

ఎందుకు నాకళ్ళని వర్షిస్తావు
నీ విరహపుటెడారులు నాలో
విహరిస్తున్నయనా

క్షమించు ప్రియా నిను
ప్రేమిస్తున్నానని అనలేను
ఎందుకంటే..అది
నీకు తెలియంది కాదు..

నిను చుంబించానని అనలేను
ఎందుకంటే..
చూడలేనంతగా నాకళ్ళు
మూతలు పడిపోయాయి.

నాకు తెల్సు
నను పొగడ్తలలో
ముంచెత్తినపుడు
నిజం చెప్పటం లేదని..

అయ్యో..
నీ తలపుల్లో
కాలం వేలి కొనలనుండి
జారి పోయిందే....

విడిపోదామనుకునే కొలదీ
బలపడి పోతూంది.
ఎందుకంటే..
నన్ను నీలో ఎపుడో వంపుకున్నానే...




Tuesday, December 22, 2009

పెళ్ళి పుస్తకం - 11



హిందూ వివాహ ప్రాశస్త్యము
పదకొండవ భాగము
తలంబ్రాలు:

పెళ్ళిళ్ళలో చిన్నలకు పెద్దలకు వేడుకగా కనపడే
తలంబ్రాలు కార్యక్రమం వెనుక ఎంత రహస్యం దాగి ఉందో
అప్పుడు చెప్పే మంత్రాలను చూస్తే మనకు తెలుస్తుంది.

తలంబ్రాలు పోసుకునేటప్పుడు వరుడు ఈ క్రింది మంత్రం చెప్పి
ముందు వధువు నెత్తిపై తలంబ్రాలు పోస్తాడు.

1. " ప్రజావే కామస్స వృధ్యతాం "
' నేను కోరిన సంతానము సమృధ్ధిగా నుండుగాక '

తరువాత వధువు ఈ క్రింది మంత్రాలు చెప్పి వరుని నెత్తిపై
తలంబ్రాలు పోస్తుంది.

2. " పశవో మే కామస్స మృధ్యతాం "
' నాకిష్టమైన పాడి పంటలు సమృధ్ధిగా నుండుగాక '

వరుడు ఈ క్రింది మంత్రాన్ని చెప్పి వధువు నెత్తిపై
రెండవ సారి తలంబ్రాలు పోస్తాడు.

3. " యజ్ఞోమే కామస్సమృధ్యతాం "
' నాకిష్టమయిన త్యాగం సమృధ్ధిగా నుండుగాక '

తరువాత ఇద్దరూ ఈ క్రింది మంత్రం చెప్పి తలంబ్రాలు
పోసుకుంటారు.

4. " శ్రియోమే కామస్సమృధ్యతాం "
' మాకు కావల సిన ధనం సమృధ్ధిగా నుండుగాక '

బ్రహ్మగ్రంధ్రి లేదా బ్రహ్మముడి :

హోమసమయమ్లో దంపతులిరువురు విడిపోకుండాను,
దూరం కాకుండాను పురోహితుడు ఇరువురి కొంగులను ముడి వేస్తూ
ఈ మంత్రమును చదువుతాడు.

" ధృవంతే రాజ వరుణో ధ్రువంతెనో బృహస్పథి:
ధ్రువంచ ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్ర ధారయతాంధ్రువం "

ఈ దాంపత్య సామ్రాజ్యమును ధరించునట్టి మీకు రాజగు
వరుణుడు,దేవుడగు బృహస్పతి, ఇంద్రుడు
అగ్ని స్థ్రిరత్వమును కలుగుజేయుదురుగాక!

" గృహ పత్నీ హధా సోవశినీత్వం విదధం ఆవదాసి "

' ఇంటి యజమానురాలుగా సర్వమునకు పెత్తనము వహించి
తీర్చిదిద్దుకొను దానవుగా ఇంటికి రమ్ము '
అని వరుడు వధువు చేయి పట్టుకొం టాడు.

పాణి గ్రహణము మరో టపాలో

కొసమెరుపు:

1. Women are unpredictable. Before marriage,

she expects a man, after
marriage she suspects

him, and after death she respects him.


2. "What's the matter, you look depressed."

"I'm having trouble with my wife."


"What happened?" "She said she wasn't

going to speak to me for 30 days.


" But that ought to make you happy."

"It did, but today is the last day."



Sunday, December 20, 2009

పెళ్ళిపుస్తకం-10



హిందూ వివాహ ప్రాశస్త్యము
పదవ భాగము
బండికాడి:

దీనికొక కధ ఉంది. అపాల అను ఒక అవివాహిత
యువతికి వళ్ళంతా బొల్లి వ్యాధి వచ్చి ఎవరూ
వివాహము చేసికొనలేదు. ఇంద్రుని గూర్చి యాగము చేసిన
అది తగ్గి పోవును. కాని వివాహము కానిది ఆ యాగము
చేయరాదు. అందుకు ఆమె విచారించుచు ఒక నదిలో
స్నానము చేయుచూ - ప్రవాహమున కొట్టుకొని
పోవుచుండగా సోమలత ఒకటి ఆమె దగ్గరికి కొట్టుకుని
వచ్చింది. ఆమె దానిని పళ్ళతో నమిలి ఇంద్రుని ఉద్దేశించి
నోటితో విడిచి పెట్టింది.
ఇంద్రుడు ఆ రసమును గ్రహించి జలమును తన రధము కాడి
రంధ్రము గుండా పోనిచ్చి ఆ జలమును ఆమెపై చల్లుతాడు.
రోగవిముక్తురాలైన ఆమెకు సూర్య వర్చస్సు వస్తుంది.
ఈ సంప్రదాయం లో
ఉత్తర దక్షిణముగా కాడిని పట్టుకొంటారు.
దక్షిణమున ఉన్న రంధ్రము గుండా వరుడు
నీటిని చల్లుతాడు. ఈ పవిత్ర జలములచే
వధువు పవిత్ర రాలగుతుంది.

"అవీరఘీ: ఉదచంతు అత:"

వీరులైన సంతతికి అరిస్టము కులుగకుండ
ఈ జలములు క్షాళనముచేయు గాక !

"ఖేఅనవ: ఖేరద: ఖేయుగస్య శచీపతే
అఫాలాం ఇంద్రత్రి: పూర్త్యకరత్ సూర్యవర్చసవ "

గగనమున పోల్చలేని రధమును నడుపు ఓ శచీపతి!
అపాలా(ఎవరి పాలనలో లేని) అయిన ఈమెను సూర్యుని
తేజస్సుగల దానినిగా మూడు మార్లు చేయుగాక.
తరువాత కాడి రంధ్రము గుండా బంగారము
(మంగళ సూత్రము) పోనిచ్చి నీరు చల్లుతూ

"శనై హిరణ్యం సము వంతు ఆప:
శనై మేధ భవంతు"

బంగారు వెలుగులు మెల్లగా జలమును
చేరి సారవంతముగాక .
మిగతా మంత్రములు వధువుని నూరు రెట్లు
పవిత్రురాలగుటకు, శాంతి నివ్వగలందులకు చెప్పును.

యోక్త్ర ధారణ : ( వధువును త్రాటితో చుట్టుట )

"ఆశాసానా సౌమనసం ప్రణాం సౌభాగ్యం తనుం
అగ్నే రనూరతా భూత్వాసన్న హ్యేనుకృతాయకం"

మచి మనస్సును, మంచి సంతతిని, సౌభాగ్యాన్ని
మంచి తనువును కలిగి ఉండి అగ్నిహోత్రమున
నాకు సహచారిణివై సత్కా ర్య ములకు సంసిధ్ధువు కమ్ము.

మంగళ సూత్రధారణ:

వరుడు సంకల్పించి మాంగళ్యదేవతను ఆహ్వానించి
షోడశోపచారాలతో మంగళసూత్రమును పూజించును.
సభలోని వారిచే దానిని సృశింప చేస్తారు.
తరువాత వరుడు ఈ మంత్రం
చెపుతూ సూత్రమును కట్టును.

"మాంగళ్యం తంతునానేన మమజీవన హేతునా
కంఠే బధ్నామి శుభగేత్వం జీవ శరదశ్శతం "

నా జీవనమునకు హేతువైన ఈ సూత్రము
చేత నేను కంఠమున మాంగల్యమును కట్టుచున్నాను.
నూరు సం వత్సరములు జీవించుము.

తలంబ్రాలు మరో టపాలో.......

కొసమెరుపు:
1. In the first year of marriage,
the man speaks and the woman listens.
In the second year, the woman speaks and the man listens.
In the third year, they both speak and the neighbors listen.

2. Love is blind but marriage is an eye-opener.

Tuesday, December 15, 2009

అసలు కెసిఆర్ తెలంగాణా వాడేనా ?

నాబ్లాగులో అసలు రాజకీయాలగురించి చర్చించకూడదనుకున్నాను.
కాని వేడెక్కుతున్న రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే
ఒక తెలుగుజాతి బిడ్డగా
నాకు తెలిసిన విషయాలను
ప్రస్తావించడం నా కనీస ధర్మం అనిపించిది.

ఒక పార్టీలో తన అస్ఠిత్వాన్ని ఉనికిని కోల్పోయి తన
స్వార్ధ ప్రయోజనాల కోసం తె.రా.స.అనే ముసుగేసుకుని 2001 ఏప్రిల్ 27 న
ప్రజలలో లేని ఉద్యమ స్ఫూర్తి ని(1969 లోనే సమసిపోయింది)
రగిలించడానికి వచ్చిన కె.సి.ఆర్ ని పాపం తెలంగాణా ప్రజలు
గుడ్డిగానమ్మి గెలిపించి....మోసపోయి....ఓడించారు.
తెలంగాణా గురించి ఒక్కడుకూడా లేకపొతే ఎలా
అని సానుభూతి
చూపించి బొటాబొటి మార్కులతో పాస్ చేసారు.
తె.రా.సా. రాజకీయ పార్టీ కాదని , ఒక ఉద్యమ పార్టీ అని తనే ప్రకటించుకొన్నాడు.
కానీ ఈ రోజు ఏం జరుగుతున్నదేమిటి? దీనికాయనిచ్చే సమాధానం ఏమిటి?
దేశం లో ఏ పార్టీ కూడా ఒక మేనిఫెస్టో అంటూ లేకుండా గెలిచిన ఏకైక పార్టీ తె.రా.స.
అధికార వ్యామోహమే తప్ప ఒక ఎం.పి. నిధులతో
ఒక్క సామోజిక కార్యక్రమం కూడాచేపట్టలేక పోయాడు.
ఇన్నళ్ళూ తన ఉనికి కోసం పాటుపడ్డమే తప్ప
తెలంగాణా ఉనికి కోసం పాటు పడిన దాఖలాలు లేవు.
ఇన్నయ్య, కెకె మహేంద్ర రెడ్డి, ప్రకాశ్ వంటి మేధావులు, నాయకులు
ఇపుడు కె.సి.ఆర్తో కలిసి ఎందుకు పనిచేయటమ్లేదు ?
ఒక్క జయ శంకర్ తప్ప ఆయనతో ఉన్న మేధావుల జాబితా ఏది?
తన కుటుంబానికి పార్టీతో సంబంధం లేదన్నాడుగా అది నిజమేనా?
ఇప్పుడు తనది కుటుంబ పార్టీ కాదా?
విద్యార్ధులలోకి గూండాలను చొప్పించి ఆంధ్రా ఆస్తుల్ని
ధ్వంశం చేయించిన కెసీఆర్ తినే తిండి ఎక్కడిది?
వెనుకబడి పోయింది అని అంటాడే..
యూనివర్సిటీలు, పరిశ్రమలు, వ్యాపారాలు అన్నీ తెలంగాణాలో ఆయనకు కనబడలేదా?
ఆంధ్రా ప్రాంతం వారు పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించకపోయింటే వీరి పరిస్ఠితి ఏమిటీ?
ఆంధ్రా ప్రాంత ప్రజలు
తెలంగాణా విడిచి వెళ్ళాలని కెసిఆర్ ప్రకటించాడు.


అదే కనక జరగాల్సి వస్తే...

మొదట వెళ్ళాల్సిన వాడు..కె.సి.ఆరే...

ఎందుకంటే ఆయన జన్మ స్ఠలం విజయనగరం జిల్లా.

Sunday, December 13, 2009

పెళ్ళి పుస్తకం - 9



హిందూ వివాహ ప్రాశస్త్యము
తొమ్మిదవ భాగము
వివాహ బంధం నిండు నూరేళ్ళు పవిత్రంగా, అన్యోన్యంగా, ఏ అరమరికలు లేకుండా దంపతులు కలిసిమెలిసి జీవించడానికి తగిన నైతిక పునాదులు ఈ కన్యాదాన తంతులో కనిపిస్తాయి.
ఇక్కడ ప్రతి మంత్రానికి ఒక విశిష్టత ఉంది. వీటి అర్ధాలు తెలుసుకుని జీవించిన నాడు వైవాహిక జీవితంలో ఏ అనర్ధాలు ఉండవు.
కన్యాదానము గుణవంత మగుటకు సాలగ్రామమును దానం చేస్తూ...
కన్యాదాత : "ధర్మేత్వయా ఏషానాతి చరితవ్య"
ధర్మాచరణమున నీవు ఈమెను అతిక్రమించి చరింపరాదు.
వరుడు : "నాతిచరామి". అతిక్రమించి చరించను
క.దా : "అర్ధేత్వయా ఏషానాతి చరితవ్య" అర్ధాచరణమున నీవు ఈమెను
అతిక్రమించి చరించరాదు.
వ. : "నాతిచరామి"
క. దా : "కామేత్వయా ఏషా నాతి చరితవ్య"
కామాచరణమున ఈమెను అతిక్రమించి చరింపరాదు.
వ. : "నాతిచరామి"
ఇది అయిన తరువాత కొంతమంది గోదానము చేస్తారు.
ఇక్కడ కొన్ని మంత్రాలు కూడా చెపుతారు.

శచీ పూజ ఎందుకు ?
సుమూహర్త సమయాన కన్యాదాత శచీదేవిని పూజించుచూ:
"దేవేంద్రాణి నమస్తుభ్యం
దేవేంద్ర ప్రియభామిని
వివాహం,
భాగ్యమారోగ్యం పుత్రలాభం చ దేహిమే"

దేవేంద్రుని ప్రియురాలవగు నీకు నమస్కారము.
వీరికి వివాహము, భాగ్యము, ఆరోగ్యము,
సంతతి కలిగింపుము. అని ప్రార్ధించును.
తరువాత వధువును తెరకు తూర్పున పశ్చిమ ముఖంగా కూర్చోబెట్టి
వరుని తెరకు పశ్చిమమున కూర్చోబెట్టి ఇరువురికి మధ్యవున్న తెరను
తొలగిస్తారు.
అపుడు వధూవరులు ఒకరి భ్రూమధ్యము మరియొకరు చూసుకుని
జీలకర్ర బెల్లమును ఒకరి నెత్తిన మరియొకరు ఉంచుతారు. వరుడు ఈ
మంత్రములు చెపుతాడు.
"ఆభ్రాతృఘ్నీం వరుణ అపతిఘ్నీం బృహస్పతే
ఇంత్ర అపుత్రఘ్నీం లక్ష్యం తామప్యై సవితస్స :"

ఈమె సోదరులకు వృధ్ధికలగాలని వరుణుణ్ణి, లక్ష్మిని,
భర్త వృధ్ధిపొందుటకు బృహస్పతినీ
ఈమెకు పుత్రసంతానము కలదానినిగాచేయుటకు
ఇంద్రుణ్ణి ప్రార్ధిస్తాడు.
"అఘోరచక్షు: అవతిఘ్నీయేది"
శుభదృష్టి కలదానవుగాను, సౌభాగ్యవతిగాను వర్ధిల్లుము.
"శివా పశుభ్య: సుమనా: సువర్చాహా:
మన పశు సంపదకు శుభములు కలుగునట్లుగా మంచి
మనస్సుతో తేజస్సుతో వర్ధిల్లుము.
"వీరనూ: దేవకామాస్యోన శంనోభవత్ ద్విపదే శంచతుష్పదే"
వీరులగు పుత్రులను కాంచుము. దేవతలు ముచ్చటపడునట్లు
మెలగుము. మనకు మనపరివారమునకు, మన పశువులకు
శాంతి కలుగు గాక.
వరపూజ, కన్యాదానము, శచీపూజ తంతులు పూర్తయిన తర్వాత
కొన్ని ప్రాంతాలలో, కొన్ని వర్ణాలలో కాడి (రెండుఎడ్ల బండికి రెండు ఎద్దులను కలుపుతూ
వాటి మెడమీద వుండే పొడవైన కర్ర దూలము ) రంధ్రము నుండి జలమును చల్లి
మరికొన్ని మంత్రాలను పఠిస్తారు.
అవి మరో టపాలో....
కొసమెరుపు:
1. A woman worries about the future until she gets a husband. A man never worries about his future until he gets a wife!


2. When a man opens the door of his car for his wife, you can be sure of one thing: either the car is new or the wife.

Wednesday, December 9, 2009

పెళ్ళి పుస్తకం - 8 (కన్యాదానము)


హిందూ వివాహ ప్రాశస్త్యము
ఎనిమిదవ భాగము
వివాహ విధానం లో అతి ముఖ్యమయినది కన్యాదానము.
ఎన్నో సం.రాలుగా ప్రేమ,మమకారాలతో పెంచుకున్న
కూతురుని ఈ ప్రక్రియతో వరునికి,
అతని కుటుంబానికి
సుఖసౌఖ్యాలను అందించాలనీ, వంశాభివృధ్ధి గావించాలని
సాక్షాత్ లక్ష్మీ సమానురాలైన కన్యని దానం చేయడం జరుగుతుంది.
కన్యాదానము చేయునపుడు కన్యాదాత కొన్ని మంత్రాలను చెపుతాడు.
అష్ట వర్షకన్యా పుత్రవత్పాలితామయా
ఇదానీం తవదాస్యామి దత్తాం స్నేహేన పాలయ II

పుత్రునితో సమానముగా పెంచబడిన ' 8 సం.ల వయస్సు గల
ఈ కన్యను నీకిచ్చుచున్నాను. నీవు ఈమెను
ప్రేమాభిమానాలతో కాపాడుము.
ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.
అమ్మాయి కి 8 సం.రాల వయస్సు వచ్చినంతనే ఆమె
కన్యగా పరిగణించ బడుతుందనీ. ఈ వయస్సు వచ్చునాటికి
కన్యాదానము జరగాలని, మనుధర్మశాస్త్రం చెపుతుంది.
కన్యానం కనక సంపన్నాం కనకాభరణ భూషితాం II
దాస్యామి విష్టవే తుభ్యం బ్రహ్మలోక జగీషియాII

బ్రహ్మలోకమును సాధించుట కొరకు, సువర్ణ సంపద గలదియు,
సువర్ణాభరణములచే అలంకరింపబడినదియు
అగు ఈ కన్యను సాక్షాత్ విష్ణు స్వరూపుడగు
నీకు ఇచ్చుచున్నాను.
విశ్వంభర: సర్వభూతా: సాక్షిణ్య: సర్వదేవతా:
ప్రదా స్యామి పితృణాం తారణాయవై.

దైవము, పంచభూతములు, సమస్త దేవతల సాక్షిగా
పితరులు తరించుటకు ఈ కన్యను దానము చేయుచున్నాను.
కన్యాం సాలంకృతాం సాధ్వీం. సుశీలాచ,సుధీమతే
ప్రయతోహ్నం ప్రయ చ్చామి ధర్మకామార్ధ సిధ్ధయే II

అలంకారములతో కూడినదియు, సాధుశీలయగు
ఈ కన్యను ధర్మకామార్ధ సిధ్ధి కొరకు పూనుకొని నేను ఈ సుశీలుడగు
బుధ్ధిమంతునుని దానము చేయుచున్నాను.
తుభ్యం ప్రజా సహత్వ ధరంభ్య: ప్రతిపాదయామి
సంతతి ని పొందుటకు, కర్మలకొరకు నీకు ఈ కన్యను నియమించుచున్నాను.
కావున వృణీధ్వం వరింపవలసింది. వృణీమహే: వరించుచున్నాను. అని వరుడు బదులు పలుకుతాడు.
వయోదాత్రే మయోమహ్యం అస్తుప్రతిగృహుత్వే

కన్యనిచ్చిన దాతకును, స్వీకరించిన నాకును బాంధవ్యము కలుగుగాక.

కన్యాదానమందలి మరిన్ని వివరాలు మరో టపాలో

కొసమెరుపు
  1. Marriage is a three ring circus: engagement ring, wedding ring, suffering.
  2. There are two times a man does'nt understand a woman, before marriage and after marriage!

Sunday, November 29, 2009

మరో లోకం లో


మనం కలిసిన
ఆ మధుర క్షణాలు
ఏ కలలు, కల్పనలు లేని
మరో లోకం లో
మనం మనకోసమే
అనుకున్నాం

ఏదో ఒక రోజు
కాలం ఈ సందేశాన్ని
నీ ముందు నిలబెడుతుంది.
నీవు లేని
నన్నుని చూస్తావు
పుడమి ఎదపై ముద్దాడిన
మన పాదముద్రికలని
నువు చూడకపోవు
పొన్నాయి చెట్టుకింద
నీ వడిలో నానుదుట
రాలిన పూవు
నీ ముద్దుతో
పొందిన అమరత్వాన్ని
నువు గుర్తించకపోవు
మన గుసగుసలు
గాలి వినిపించక పోదు
కిలకిలరావాలలో
పరిమళించిన ఆశలు
వినబడకపోవు

నీ రాకకై ఈ తోట
పూల పానుపు
పరిచింది..
ఒక్క భ్రమరం కోసం
వలపు రంగులద్దుకుని
మత్తుగా నీకోసం
వేచి చూసే వేల సుమాల్లో
నను గుర్తించ గలవా ప్రియా...


Monday, November 23, 2009

పెళ్ళి పుస్తకము -- ఏడవ భాగము


హిందూ వివాహ ప్రాశస్త్యము.
ఏడవ భాగము
వివాహ మంత్రాల అర్ధము




మరికొన్ని మంత్రాల అర్ధాలను ఇక్కడ చూద్దాం.
వధూవరుల గోత్రాలు తెలిపిన తర్వాత...
" ధర్మప్రజా సంపత్యర్ధం పృణీమహే"
(ధర్మ సంతాన సంపద కొరకు కన్యను
ఎన్నుకొనుచున్నాను
) అని వరుడు అనగా:
"వృణీధ్వం దా స్వామి"
(ఎన్నుకొంటిరి గావున ఇచ్చుచున్నాను)
అని కన్యాదాత అంటాడు.
" కృతార్ధావయం "
(కృతార్ధులయినాము)
అని కన్య వెదికినవారవరైనా ఉంటే వారంటారు.
అపుడు వరుడు....
" శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ధర్మ ప్రజా
సంపత్యర్ధం : స్త్రీయం ఉద్వహే"

(శ్రీ పరమేశ్వర ప్రీతి కొరకు, ధర్మ సంతానము
కొరకు
ఈమెనువివాహం చేసుకొనుచున్నాను.
అని
అంటాడు.)
లక్ష్మీనారాయణ స్వరూపుడుగా కన్యాదాత వరుని పూజించును.
కాళ్ళు కడిగినపుడు
' ఆవ: పాదావనే జనేర్ ద్వివంత నిర్దహంతుమే'
( పాదములను రక్షించు దేవతలను
సంకల్పించు
జలములునా శత్రువులను
నిశ్శేషముగా
దహింతురు గాక.)
రెండు పాదములను కడిగి అర్ఘ్య పాద్యాదులు
అయిన
తరువాత మధుపర్కం (తీయని పానీయం )
మూడు
సార్లు వరుడికి కన్యాదాత ఇస్తాడు.
మరికొన్ని మంత్రాల అర్ధాలు మరో టపాలో...
కొసమెరుపు:
కళ్ళు రెండూ తెరచి ఉంచు పెళ్ళికి ముందు,
సగం
మాత్రమే తెరువు పెళ్ళితర్వాత. ........బెంజమిన్ ఫ్రాంక్లిన్
Marriage is the institution where the woman loses her the name and the man his solvency ~ Anonymous

Friday, November 13, 2009

పెళ్ళి పుస్తకం - ఆరవ భాగం









హిందూ వివాహ ప్రాశస్త్యము.
ఆరవ భాగము

వివాహ మంత్రాల అర్ధం
వివాహ సమయం లో వధూవరులతో చెప్పించే మంత్రాలను పరిశీలిస్తే మం ప్రాచీనుల దూరదృష్టి, భావ పటిష్టత ప్రతి పదమ్లో కనిపిస్తుంది. కనీసం కొన్ని మంత్రాలకైనా అర్ధాలు కొత్తగా పెళ్ళి చేసుకునేవారు, పెళ్ళి అయిన వారు గ్రహిస్తే మన సంప్రదాయ తత్వం బోధపడి కొన్ని సందేహాలు తొలగిపోయి లోక కళ్యాణం జరుగుతుంది. అందుకే కొన్ని మంత్రాల భావాలను తెలుసుకుందాం.
ఇవి కేవలం జనబాహుళ్యం లో ఉన్నవి మాత్రమే కాని.... ఇవే అన్ని మంత్రాలు కాదు.

కాశీ యాత్రకు వెళ్ళునపుడు(ఇది కొన్ని వర్ణాలలో) బంగారు ఆభరణాలు ధరిస్తారు.
అందువలన కలిగే లాభములు ఈ మంత్రములో....

" ఆయుష్యం,వర్చస్యం రాయస్పోష మౌద్బిదం
ఇదం హిరణ్యం వర్చస్వజైత్రాయా విశతాదిమాం "


ఆయుష్షు ను వర్చస్సును, జయమును కలిగించుట కొరకు
నాయందు ఉండుగాక.

" శత శారదా యాయుష్మాన్ జరదృష్టి ర్యదాసత్
మృతాదుర్ల్ప్తప్తం మధువత్ సువర్ణం ధనం జననం

రుణం దార యిషుణం "


నూరు సం వత్సరముల వరకు ఆయువు, ముసలినతనం వచ్చువరకు జీవించి యుండునట్లు చేయును గాక !
నేతి నునుపు ఆరకుండునట్లు గా మంచి రంగు సంపద, జయము దృఢత్వము కలుగును.

" ప్రియం మా కురదేవేషు ప్రియం రాజసు
మా కురు ప్రియం విశ్వేషు గోప్ర్తేసు II"


నాకు దేవతలతోను, రాజులతోను, లోక రక్షకులతోను, ప్రియ సంబంధము కలిగింపుము.
ఈ విధంగా మనం మంత్రాన్ని బంగారాభరణాలను ధరించుతూ చెపుతారు.
కొసమెరుపు:

@ Shaadi ke pehle - Ek Duje Keleye
Shaadi ke baad - Sirf Bachcho Ke Liye
@ Shaadi ke pehle - Dilwale Dulhaniya Le
Shaadi ke baad - Baaki Log Sukhi Ho jayenge
@ Shaadi ke pehle - Chandramukhi
Shaadi ke baad - Jwaalamukhi

@ Shaadi ke pehle - Maine Pyar Kiya

Shaadi ke baad - Ye Maine Kya Kiya?

Wednesday, November 11, 2009

ప్రతిసారీ మొదటిసారే....

ప్రతిసారి మొదటి సారిలా
ఏ గది మూలనో
అలజడి రేగి

రాత్రి అదే సమయానికి
కిటికీ తెరిచే సరికి
ఎదురింటి గుమ్మంలో
అఛిద్రమైన చీకట్లో
నాకోసం
నీవు...

కాలం జారిపోతూ
చిదిమిన చివరి
క్షణం నుండి
నీ కోసం
నేను...

చేరువయ్యే కొద్దీ
దూరమై
దూరమయ్యే కొద్దీ
చేరువయ్యే మనకి
ఎచటి నుండో
మూగ రాగాలు
మోసుకొస్తూంది ఆమని

నేనేనా...

విరితావులపై
ఇంద్రధనుస్సు
వలిగిపోయిందేమో...
నీ కురుల పానుపు మీద
పవళించాలని
పూలన్నీ మత్తుగా
నీ కోసం...

Monday, November 9, 2009

నీవు లేని.....నాలో


ఏవో భావనలు
నను కమ్మేస్తూన్నాయి
మనిద్దరిని దగ్గర చేస్తూన్నాయి

నీకోసం
సాగరాన్నైనా ఈదగలను
గాలిని గుప్పిట పట్టి
ఎక్కడికైనా ఎగర గలను

కాని ....
నీవు లేని నా హృదయం
ఆకాశం లేని పక్షిలా
నీవు లేని నా ఆత్మ
తప్పిపోయిన లేడిపిల్లలా
నిను చూడని నాకళ్ళు
శిశువు త్రాగక నిండిన
తల్లి పాలిండ్లలా
నీవు లేని నా కన్నీళ్ళు
ఉదయం లేని
మంచు బిందువుల్లా..

అనంత దూరానికి
ఇరువైపులా
మనం
నువు
గుసగుసలాడినా చాలు
వినిపిస్తుంది
నా హృదయానికి
కాదనకు ప్రియా.......

Friday, November 6, 2009

పెళ్ళి పుస్తకం.. ఐదవ భాగం - బి


హిందూ వివాహ ప్రాశస్త్యము.
ఐదవ భాగము - బి
అన్ని అనుభవాల్లో పురుషుడు స్త్రీ సమానంగా ఉన్నప్పుడే స్త్రీ పురుషునికి అర్ధాంగి అవుతుంది. ఈ వివాహ బంధం ఈ లోకంలోని ఈ జన్మలలో వీరిద్దరిని కలుపుతూనే ఉంటుంది. ప్రపంచ మానవ జీవితంలో ఆయా దేశాల్లో ఆయా సంప్రదాయాల్లో తేడాలున్నా వివాహమనేది ఒక విచిత్రబంధం. మన భారతదేశమ్లో నియమముగా బ్రహ్మచర్యాన్ని గడిపిన స్త్రీ పురుషులు సంఘ శ్రేయస్సును, తమ వంశ శ్రేయస్సును, తమ శ్రేయస్సును దృష్ఠిలో ఉంచుకొని, సకల ధర్మాలకు ఆశ్రయభూతమైన ఈ సంసారం చేసుకుంటారు. దీనిలో మానవ మనస్తత్వం లో ఎన్నో మార్పులు వస్తాయి. బాధ్యత పెరుగుతుంది.
గురుకులం లో విద్యాభ్యాసం ముగించిన తరువాత శిష్యునికి గురువు
" ప్రజాతంతుం మావ్యవచ్చేత్పీ:"
నీ వంశ పరంపరను నశింపజేయకుము. ఇంటికి వెళ్ళి వివాహం చేసుకోమని ఆజ్ఞాపించును.
కనుకనే లోకజ్ఞుడగు మహాకవి కాళిదాసు రఘువంశ రాజులను వర్ణించుచూ..
ప్రజాయై గృహ మేధినాం "...... సంతానం కొరకే గ్రుహస్తులగువారని చెప్పినాడు.
సంతాన ప్రాప్తి అనంతరం వారికి గృహస్తాశ్రమ ఆశక్తి లేదని వాన ప్రస్థులగుదురని కూడ దీనిని బట్టి తెలుస్తుంది.
కనుక మానవ జీవితంలో సకల శ్రేయస్సులకు మూలభూతమైన వివాహబంధం చాలా ప్రశస్తమైనది.
కొసమెరుపు :
ఘనా దేశం లోని ' ఆసాంటే ' అనే తెగలో
వరుడు, వధువు ఇంటి కెళ్ళి తలుపు తడతాడు. లోపలున్న వధువు తిరిగి తలుపు తడుతూ సమాధానం ఇస్తే...వరుడి తల్లి , మేనమామ వధువు ఇంటికి వెళ్ళి వివాహ ప్రతిపాదన చేస్తారు.
వివాహ మంత్రాల అర్ధం...తరువాయి టపాలో...






Monday, November 2, 2009

నో... హి షుడ్ స్పీక్ ఇం గ్లిష్


నో... హి షుడ్ స్పీక్ ఇం గ్లిష్ దట్సాల్

గత వారం రోజులనుంచి బ్లాగుల్లో వచ్చే విషయాల్లో ముఖ్యంగా " ఐ నెవర్ స్పీక్ తెలుగు " గురించే..
ఇదిలా ఉంటే...దాదాపు రాష్ట్రం లోని చాలా పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ లోనే మాట్లాడాలనే నిబంధనని పాక్షికంగా సడలించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే మా పాఠశాలలో ఈ విషయంలో ఎప్పుడూ ఎటువంటి ఆంక్షలు గాని శిక్షలు గాని లేవు. కేవలం పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి వివిధ రకాలయిన కార్యక్రమాలను నిర్వహించడం, కమ్యూనికేషన్ స్కిల్స్ రంగం లో నిష్ణాతులను రప్పించి దాని ఆవశ్యకతని తెలియచేయడం నిత్యం జరు గుతూంటాయి.
ఏదో ఒక టాపిక్ ఇచ్చి విధ్యార్ధు లందరిచేత మాట్లాడిస్తాం. వారి తప్పుల్ని తెలియజేస్తాం. ప్రోత్సాహక బహుమతులిస్తాం.
ఇంకా చెప్పాలంటే...బహుసా రాష్ట్రంలో స్పోకెన్ ఇంగ్లిష్ ఒక సబ్జక్ట్ గా బోధించే అతికొద్ది పాఠశాలల్లో మాదీ ఒకటని గర్వంగా చెప్పగలను.
సిడి ల ద్వారా ఎంతో సమాచారాన్ని వారికి అందచేస్తాం.
గత రెండు సం.రాలుగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు నిర్వహించే స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షలకు ఇష్టమున్న విద్యార్ధులకు శిక్షణ ఇప్పిస్తున్నాం.
మరో విషయమేమంటే..గత సం.రం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారి అనుబంధ సంస్ఠ(MaaRs International) వారు నిర్వహించిన " స్పెల్ బీ ఇంటర్నేషనల్ " పోటీలలో దేశవ్యాప్తంగా వందల పాఠశాలలు పాల్గొన్నాయి. మా పాఠశాల పిల్లలు రాష్ట్రస్థాయి, అంతరాష్ట్రీయ,అంతర్జాతీయ స్థాయిలో 1,2,3.... స్థానాలు కైవశం చేసుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తాను.
ఈ మధ్య ఒక పేరెంట్ కలిసారు. తన కొడుకు ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూ..
మేడం. మా అబ్బాయి కొంచెం స్లో లెర్నర్. అన్ని సబ్జక్టుల్లోను ఏవరేజ్ గా ఉన్నాడు.
ఫర్వాలేదు. పికప్ అవుతాడు లెండి. ఇపుడిపుడే అలవాటు పడుతున్నాడు.
I know his improvement is slow but steady. అన్నాను.
అంతేకాదు మేడం. వాడికసలు ఇంగ్లీషు మాట్లాడడమే రావట్లేదు. మా చెల్లెలుగారి పాప మా బాబు లాగే ఏడో తరగతి ఫలానా______ స్కూల్లో చదువుతూంది. తను ఇంగ్లిష్ చాలా బాగా మాట్లాడుతాది. బాబుకెందుకు రావట్లేదు.
వస్తుంది. మీరేమీ ఖంగారు పడనఖ్ఖర్లేదు. నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటాడు.
లెర్నింగ్ అనేది నిదానంగా జరుగుతుంది కాని దాని ఫలితాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి.
కాబట్టి మీరు ఆందోళన చెందకండి. తను తప్పకుండా మాట్లాడగలడు.
అంటే..ఈ వారం వార్తల్లో వచ్చిన ఇంగ్లీష్ స్పీకింగ్ కధనాలని బట్టి....మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద నిర్వహించే కార్యక్రమాలు సడలిస్తారేమోనని....
అదేం లేదండి..మీకు తెల్సు మాది నిర్బంధ విద్య కాదు. కాబట్టి ఎటువంటి సడలింపులు ఉండవు.
ఆ విషయం తెల్సు. మేడం. We joined him English medium for getting used with English. We are paying thousands and thousands.
ఇంగ్లీష్ మాట్లాడడం రాక పోతే భవిష్యత్తు అంధకారమే కదా.
So I don't know anything. He should speak in English....

ఇలాంటి పేరెంట్స్ ని చూస్తే.....




పెళ్ళి పుస్తకం - ఐదవ భాగం


హిందూ వివాహ ప్రాశస్త్యము.
ఐదవ భాగము - ఎ
రోజూ ఉదయాన్నే లేచే నాకు ఆదివారం వచ్చేసరికి చాలా బధ్ధకం వచ్చేస్తుంది. ఆయన మాత్రం ఉదయాన్నే లేచి రైతుబజారు కెళ్ళి కూరలు తెచ్చి పడేస్తారు. ఈ వారం ఆయనలేరు. నేనే వెళ్ళాలి. తప్పదు. పిల్లలింకా లేవలేదు. గబగబా తయారయి బండేసుకుని బయలుదేరాను. వచ్చేటపుడు నీలిమ వాళ్ళింటికి వెళ్ళాను.నీలిమ నా టెంత్ క్లాస్ మేట్. పాపం పెళ్ళయిన సం వత్సరానికే భర్త పోయాడు. సర్వీసులో చనిపోయాడు కాబట్టి దానికి రెవెన్యూ డెపార్ట్ మెంటులో జాబ్ ఇచ్చారు. అత్తమామలతో ఇక్కడే ఉంటుంది. మా సర్కిల్ లో తనెపుడూ అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి. నేనసలు పెళ్ళేచేసుకోను. ఏకాకిగానే బ్రతికేస్తాను అని అంటూండేది. దీని మీదే ఎక్కువ చర్చలు జరిపేవాళ్ళం. అయితే అవి పెళ్ళి మీద ఎక్కువ అవగాహన లేని రోజులు. గుమ్మమ్లో ముగ్గు పెడుతూన్న నీలిమ నవ్వుతూ ఇంట్లోకి తీసుకెళ్ళింది. అత్తగారికి మావగారికి నేనంటే బాగా ఇష్టం. నీ బ్లాగ్ సీరియల్ ఎంతవరకూ వచ్చిందమ్మా అంకుల్ అడిగారు. బాగానే వస్తుందంకుల్. నాకు బ్రూ కాఫీ అంటే ఇష్టం అని నీలిమకి తెల్సు. ఒక లార్జ్ కప్ నిండా తీసుకొచ్చి తన రూంలోకి తీసుకుపోయింది. ఆనాటి నీలిమకి ఈ నీలిమకి ఎంత తేడా! కళ్ళల్లో కమ్ముకున్న దైన్యం. నీ సీరియల్ చదువుతున్నానే. చాలా బాగా రాస్తూన్నావు. ఈ వారం పెళ్ళి - దాని ఆవశ్యకత గురించి వ్రాయవే. అని తల దించుకుంది. అలాగేనే.. ఎపుడు కలిసినా దాన్ని చూస్తే ఎక్కువ సేపు ఉండలేను. బయలుదేరుతూంటే.. వాడులేని లోటు ఎవరం తీర్చలేమమ్మా. కనీసం నీవైనా అపుడపుడూ వస్తూండమ్మా. మీలాటి వాళ్ళని చూసైనా తను మళ్ళీ పెళ్ళి చేసుకుంటుంది. గేటు వరకూ వచ్చి నెమ్మదిగా ఆంటీ అన్నారు. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినయ్. తల్లి లాంటి అత్తగారు. అందుకే ఈ ఎపిసోడ్ నీలిమకు, నీలిమలాంటి వాళ్ళకూ అంకితం.
వివాహం - ఆవశ్యకత

తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మానవుడు పుడుతూనే ఋణపడుతున్నాడు. ఈ ఋణం తీరాలంటే తన వంశాన్ని నిలబెట్టి పితృదేవతలకు తృప్తి కలిగించాలి. సృష్టి ఆదినుంచీ తన వరకు వచ్చిన వంశాన్ని నిలబెట్టుకోవడానికి అతడు తనకు అన్ని విధాలా తగిన కన్యను వివాహమాడాలి. ధర్మ వివాహం వల్ల పుట్టిన సంతానమే పితృదేవతలను తృప్తి పరుస్తుంది. వంశాన్ని నిలబెడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే సకల ప్రాణులకూ శాంతియుత సహజీవనం, ఇహపర సౌఖ్యాలు కలిగిలా మహర్షులు ధర్మ శాస్త్రాలను బోధించారు. మానవ జీవితానికి నాలుగు ఆశ్రమాలున్నాయి. అవి.
1. బ్రహ్మచర్యం 2. గృహస్థం 3. వానప్రస్థం 4. సన్యాసం
వీటిలో గృహస్థాశ్రమం అన్ని విధాలా అందరికి ఆశ్రయింపదగినది.
యధా మాతార మాశ్రిత్య సర్వేజీవంన్తిజ న్తవ: ! తధా గృహస్థమాశ్రిత్య సర్వే జీవన్తి మానవా: !!
లోకములో ధర్మార్ధకామరూప పురుషార్ధాలలో మానవునికి భార్యవలనగాని పరిపూర్ణత లభించదు,కనుకనే వివాహ సమయమ్లో అనాదిగా వరునిచే ఈ ప్రతిజ్ఞ చేయించడం జరుగుతూంది.
" ధర్మేచ, అర్ధేచ, కామేచ, త్రయైషా నాతిచరితవ్యా " అని కన్యాదాత చెప్పగా వరుడు... " నాతి చరామి " ఈమె నతిక్రమించి నేను నడువను" అని ప్రతిజ్ఞ చేస్తాడు.
ఈ వివాహ మనే సంస్కారం ఉంటేనే లోకం లో మనమెన్నో వైపరీత్యాలను చూస్తూన్నం. అసలు ఈ సంస్కారమే లేకపోతే లోకమెంత అస్తవ్యస్తమై పోతుందో ఊహించలేం. లోకమ్లో అనాదిగా మానవుని బుధ్ధిబలం ,ఆత్మ సంస్కారం పెరుగుతున్నదంటే దానికి పరోక్షంగాను, ప్రత్యక్షంగాను ఈ వివాహం కారణం అని చెప్పక తప్పదు. వివాహం చేసుకునే వయసు వచ్చినా వివాహం చేసుకోని స్త్రీని చూస్తే సంఘం ఏమనుకుంటుంది ? అలగే వివాహం చేసుకోని పురుషున్ని చూస్తే ఏమని అభిప్రాయపడుతుంది. వారు సన్యశిస్తే ఏ ప్రశ్నాలేదు. లేదా భీష్మునివలె ఆజన్మ బ్రహ్మచర్య దీక్ష వహించినా బాధలేదు. కనుకనే స్మృతికారులు స్త్రీ పురుషులకు వివాహ సమయాన్ని గూడా నిర్ణయించారు. ఒక రకంగా ఆలోచిస్తే ఆకాశమ్లో విహరించే చంచలమైన పురుషుని మంస్సనే గాలిపటానికి దార (భార్య) బలమైన దారం లాంటిది. ఆ రెంటి సమ్మేళనమే వివాహం. వివాహం జరిగితే మానవ జీవితం లో ఒక నిండుదనం కనబడుతుంది. భార్యాభర్తలు శారీరకంగా వేరైనా మానశికంగా ఒకటై సమానంగానే అన్ని అనుభూతులను ఒకటిగా అనుభవిస్తూ మధురంగా ఈ వివాహ జీవితం లో కాలం గుడుపుతారు. ఏడు జన్మల సంబంధం వారిద్దరికి ఉన్నట్టు మన హిందూ ధర్మం చెపుతుంది. వేరేచోట్ల పుట్టినా వేరే వాతావరణం లో పెరిగినా వివాహమైన తరువాత ఇద్దరి అనుభూతులూ ఒకటౌతాయి. భగవంతుని సంకల్ప ప్రకారమే వారిద్దరూ తగిన సమయమ్లో దగ్గరౌతారు. కనుకనే " వివాహాలు విధి నిర్ణీతాలు " అంటారు పెద్దలు.
కొస మెరుపు:

కంగ్రా లోయ లోని 'గద్ది' అను గిరిజన జాతిలోపెళ్ళి చాలా ముఖ్యమైనది. పెళ్ళికాని వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు దయ్యాలై తిరుగుతాయని వారి నమ్మకం. వరుడు తెల్లని బట్టల్లో నుదుటిన విభూదితో శివుడిలా తయారవుతాడు. వరుడు ఒక బిక్షగాని వలె ఒక బొచ్చె (బిక్షగాని చేతిలో ఉండే ఒక గిన్నె)పట్టుకుని వధువు ఇంటివద్ద పిల్లని తనకు ఇచ్చి వివాహం చేయమని యాచిస్తాడు. వధువు తల్లి అతనికి రుచికరమైన ఆహారాన్ని పెట్టటం ద్వారా తమ ఇష్ఠాన్ని తెలియచేస్తుంది. ఆ తర్వాత సాంప్రదాయ వివాహ వేడుకలు జరుగుతాయి.

హిందూ వివాహ ప్రాశస్త్యము - ఐదవ భాగము - బి
తరువాయి టపాలో

Tuesday, October 27, 2009

పెళ్ళి పుస్తకం --నాల్గవ భాగం


హిందూ వివాహ ప్రాశస్త్యము.
నాల్గవ భాగము
మొదటి కార్తీక సోమవారం బాగా జరిగింది. మా ఫ్లాట్ లో వాళ్ళందరూ కలిసి రెండు ఆటోలలోనూ,
ఉన్నవాళ్ళు వారి కార్ల లోను శివాలయానికి వెళ్ళాం. పిక్ నిక్ ఎక్కడ జరుపుకోవాలన్న విషయం చర్చకి వచ్చింది..
మగ వాళ్ళందరూ అన్నవరం వెళదామని, ఆడవాళ్ళు దేవిపురం వెళదామని ప్రపోస్ చేసాం.
అప్పటివరకూ ఆలయం పార్క్ లో ఆటలాడుకుంటూన్న పిల్లలకి ఎలా తెలిసిందో ఏమో...
ఒక్కసారిగా వచ్చి ...మేమందరం ఆల్రెడీ డిసైడ్ అయి పోయాం. లాస్టియర్ కూడా మీరు తీసుకెళ్ళిన చోటుకే వచ్చాం .
ఈసారి అలా జరగడానికి వీల్లేదు. మేమంతా ' జూ ' కి వెళ్ళాలనుకుంటూన్నాం. వస్తే మీరు మాతో రండి.
లేదంటే గుంటూరు తాతయ్య ని తీసుకుని మేమంతా జూకి వెళతాం.
మా అందరి చూపులు ఒక్క సారిగా గుంటూరు తాత గారి మీదకు మళ్ళినయ్...
ఇందులో ఆయన ప్రమేయమేమి లేదు. ఇది మా స్వంత నిర్ణయమే.
మా ఫ్లాట్ లలో ఒక ఫామిలీ గుంటూరునించి వచ్చి సెటిల్ అయ్యారు.
వారింట్లో పెద్దాయనకి పిల్లలంటే చాలా ఇష్టం.
అందరూ ఆయన్ని గుంటూరు తాతయ్య అని పిలుస్తారు.
ఇంతలో రెండవ ఫ్లోర్ లో ఉండే చిన్నిపాప మేఘన (3rd class)
నా దగ్గరకి వచ్చి ..
Hanti, I have never seen a zoo, hanti. I want to see animals.
I want to climb on elephant. Please hanti, let us go to the zoo hanti,
please hanti, please hanti.....
మేఘన అంటే అందరకీ ఇష్టమే. అయినా మిగిలిన వాళ్ళని తృణీకరించలేము.
O.K. O.K. ఇళ్ళకి వెళ్ళాకా మూడు ప్లేసులకి డ్రా వేద్దాం.
ఆ మర్నాడు డ్రా తీయడము అందులో జూ రావడమూ పిల్లలందరికి ఆనందమైపోయింది.
చక చకా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.
భోజనాలయిన తర్వాత ఏదో వినోద కార్యక్రమాల్లో భాగంగా..డ్రాలో నేనొక ఉపన్యాసం ఇవ్వాలి.
అప్పటికే మావాళ్ళలో కొద్దిమందికి నా బ్లాగోపాఖ్యానం గురించి తెలిసింది..
వివాహ స్వరూపం గురించి చెప్పమన్నారు.
మావారు నాకేసి గర్వంగా చూడటం నాకెంతో ఆనందంగా ఉంది.

అందరికీ నమస్కారం.

కార్తీక మాస వన భోజనాల పర్వ దినాన మనందరం ఇలా కలసి ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది.
మీలో చాలామంది పెళ్ళి చేసుకున్నవారే..పెళ్ళిళ్ళు చేసినవారే..
ఇపుడు నేచెప్పబోయేవిషయాలు మీకందరకు తెలిసినవే.
అయితే మన హిందూ సంప్రదాయం లోని వివాహ వ్యవస్ఠ కి విదేశాలలో మంచి పేరుంది.
దురదృష్ఠవశాత్తూ మన హిందువులు మాత్రం పాశ్చాచ్య నాగరికతకై పాకులాడుతున్నారు.
ఈ సాంప్రదాయాన్ని మన భావితరాలకి అందించాలనే తపనతో నా బ్లాగులో హిందూ వివాహ ప్రాశస్త్యం గురించి టపా చేస్తూన్నాను.
ఐతే ఈరోజు మీకు సింపుల్ గా వివాహ స్వరూపం గురించి వివరిస్తాను.

హిందూ వివాహ స్వరూపము.
పెద్దలు సుముహూర్తం నిశ్చయం చేసిం తరువాత అంకురారోపణం, దేవతాహ్వానం చేస్తారు.
వరుడు తన ఇంట్లోనే స్నాతక వ్రతం( కొన్ని వర్ణాలలో మాత్రమె) చేసుకుంటాడు.
వధూవరులు ఇద్దరూ మంగళ స్నానాలు చేస్తారు. వినాయకుణ్ణి వివాహం నిర్విఘ్నంగా జరగాలని పూజించి పుణ్యాహవాచనం చేస్తారు. కంకణాలను పూజించి ముందు వరునికి కడతారు.
ఇవెందుకు కడతారో తెలుసా ?
కంకణం కట్టడం వలన ఎటువంటి మైలలు వచ్చినా అతనికి సోకవు.
తరువాత కన్యచే గౌరీపూజ, కంకణపూజ చేయించి కన్యకు కూడా కంకణం కడతారు.
తరువాత వరపూజ.
వరపూజ అంటే...కన్యాదాత వరుడి కాళ్ళు కడిగి మధుపర్కం ఇస్త్తాడు. వరుడికి వస్త్రాభరణాలిస్తారు.
తరువాత సన్నటి తెర ను మధ్య పట్టుకుని కన్యను రప్పించి కన్యాదానం చేస్తారు.
తరువాత ఇతర దానాలు కూడా చేస్తారు.
వధూవరుల గోత్రనామాలతో పూజ చేయిస్తారు.
కన్నాదాత వరునిచే ధర్మార్ధకామాలలో ఈ కన్యను విడువనని ప్రమాణం చేయిస్తాడు.
సుమూహర్త సమయమ్లో వధూవరులిద్దరూ ఒకరి తలపై ఇంకొకరు జీలకర్ర, బెల్లం పెట్టి
అందరి సమక్షమ్లో దంపతు లైనట్లు పరిగణింపబడతారు.
నిజానికి వివాహం అంటే ఇదే. మంగళ సూత్రధారణ కాదు.
తరువాత తెర తీస్తారు.
శుభ సమయం లో వరుడు వధువును చూస్తాడు.
నూతన దంపతలిద్దరినీ పక్క పక్కన కూర్చోపడతారు.
తరువాత కన్య శిరస్సు మీద కాడి ( బండికి గాని, నాగలికి గాని
రెండెద్దుల మధ్యఉండే కర్ర )కి ఉండే
రంధ్రం గుండా బంగారు వస్తువు ని ఉంచి వరుడు అభిషేకం చేస్తాడు.
వధువుకి కొత్తబట్టలు ఇస్తారు.
వరుడు వధువు నడుమునకు ధర్మతాడు కడతాడు.
తదుపరి పెద్దలందరూ కళ్ళకి అద్దుకున్న మంగళసూత్రాన్ని వధువు మెడలో
రెండు గట్టి ముళ్ళనూ, మూడవది వదులుగానూ కడతాడు.
పెద్దల ఆశీస్సు లు పొంది, తలంబ్రాలు పోసుకుంటారు.
బ్రహ్మ ముడులు వేసిన తరువాత కన్య చేయి పట్టుకుని వరుడు
ఏడడుగులు నడిపిస్తాడు.
తరువాత ప్రధాన హోమం , ప్రవేశ హోమం, సదశ్యం , నాకబలి ,
అప్పగింతలు వగైరా జరుగుతాయి.
ఇది స్థూలంగా వివాహ స్వరూపం.

అందరి కరతాళ ధ్వనుల మధ్య నేను
మావారి కళ్ళల్లో సన్నని కన్నీటి పొర గమనించక పోలేదు....

వివాహ ప్రశస్తి ...మరో టపాలో..





Sunday, October 25, 2009

మాయా ఏంజిలౌ

అమెరికా జాత్యహంకారపు పడగ నీడలోఅణగద్రొక్కబడిన నల్ల జాతి బానిస జీవుల జీవితాలలో తమ రచనలతో వెలుగులు నింపిన అతికొద్దిమంది నల్లజాతీయులలోమాయా ఏంజిలౌ ఒకరు.విలక్షణమైన వ్యక్తిత్వం, నిర్మొహమాటమైన వైఖరి ఈమె రచనల్లో కనిపిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి వివిధ రచనా ప్రక్రియలలో అసాధారాణ ప్రతిభ ఆవిడ సొంతం. Still I rise, On the pulse of morning, Life doesn't frighten me etc., అనే కవితలుI know why the caged bird sings, The heart of a woman అనే ఆత్మకధలు ఆమెకి బాగా పేరు తెచ్చిన రచనలు.

Still I rise


నీ దుర్భాష్యాలతో, అబధ్ధాలతో
నాకు హేయమైన చరిత్ర సృష్ఠించవచ్చు
నీ ఉక్కు పాదాలతో నను
భూస్థాపితం చేయవచ్చు
అయినప్పటికీ
నేను ఉదయిస్తాను
గోధూళినై..

నా ఆత్మవిశ్వాశం నిన్ను కలవర పరుస్తోందా?
నీవెందుకు దుఖ:సాగరంలో మునిగిపోయావు ?
నా ఇంట్లో చమురుబావులు న్నంత
గర్వంతో నేను నడుస్తున్నందుకా ?


సూర్య చంద్రుల్లా

తీరాల్ని తాకే అలల్లా
ఉవ్వెత్తున ఎగిసె పడే

ఆశల ఉప్పెనలా
ఉదయిస్తాను

ఆత్మఘోషతో అచేతననై
కన్నీటిధారలతో తలదించి విగతనై
నీముందు
నిలబడాలనుకుంటున్నావు కదూ..

నా అహంకారం నిను బాధిస్తూందా ?
ఎందుకంటే నా పెరట్లో
నేనేవో
బంగారు గనులు తవ్వుతున్నంత
ఆనందంగా వున్నాను..
ఇదొక ఘోర విపత్తనిపిస్తోందా?


నీ మాటల తూటాలతో

నను కాల్చివేయవచ్చు

నీ చూపుల్తోనను

తునాతునకలు చేయవచ్చు

నీ ద్వేషాగ్నిలో

నను భస్మం చేయవచ్చు
అయినప్పటికీ ఉదయిస్తాను
అనంత వాయువునై

నా సౌందర్యం

నిను కలవర పెడుతోంది కదూ
....
నా వాంఛలు తీరినట్లు

నేనేదో కానుకలు పొందుతున్నట్లు

నే చేస్తూన్న నాట్యం
ఆశ్చర్యంగా ఉందికదూ ...

చరిత్ర చీకటి
పుటల్లోంచి
ఉదయిస్తాను..

గాయాలమయమైన
గతం
మూలాల నుండి
ఉదయిస్తాను

ప్రతికెరటం లోను

ఉవ్వెత్తున ఎగిసిపడే వెల్లువతో

జలిస్తూ విశ్వవ్యాపితమైన

నల్ల సముద్రాన్ని నేను


భయాన్నీ, భీకర రాత్రులను చేధించి
సర్వశోభితమైన అరుణ కిరణాల్లా
ఉదయిస్తాను
తరతరాల వారసత్వ
పోరాట పటిమను
మీ కందిస్తూ
బానిస బ్రతుకుల పాలిట
ఒక అందమైన స్వప్నంలా
ఒక ఆశలా

ఉదయిస్తాను...

Saturday, October 24, 2009

పెళ్ళి పుస్తకం - మూడో భాగం.




హిందూ వివాహ ప్రాశస్త్యము.
మూడవ భాగం.

దీపావళీ దగ్గరపడిందంటేనే మనసెంతో ఆనందంగా ఉంటుంది. తర్వాత కార్తీకమాసం నిత్యపూజలు భగవన్నామస్మరణ ..మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. మొదటి కార్తీక సోమవారం పూజకి సామాన్లు కొనడానికి శివాలయం వీధి వైపు బయలుదేరుతుండగా విజయ నుంచి ఫోనొచ్చింది. నా క్లాస్ మేట్. మధ్యే బదిలీ అయి వచ్చారు. ఫోను లిఫ్టు చేసాను.
హలో విజయా! బాగున్నావా?
బాగున్నానే..
నిన్న రాత్రే చాలా సేపు మాట్లాడుకున్నాం. వారం లో రెండు మూడు సార్లు ఫోనులో మాట్లాడుకుంటాం. నెలకొకసారైనా వీకెండ్ హోటల్లోనో ఎంజాయ్ చేస్తాం. అయితే ఏమిటి సంగతి ఇంత సడన్గా.
ఏమిటే విజయా!
. ఏమ్లేదే.మేము శ్రీకాకుళం లోఉన్నపుడు మా మరిది వికాశ్ లేడా. అతను అమ్మాయితో ప్రేమలో పడ్డాడే. ఎలగోలా అతని మనసు మళ్ళించి, ఇక్కడకి ట్రాంసఫర్ పెట్టించుకుని ఇక్కడకు వచ్చేసాం. కానీ ఇప్పుడు అతను ఉదయం నుంచి కనిపించట్లేదే.
అక్కడ అమ్మాయి కూడా...
లేచి పోయారా.....
హా. అంతే కావచ్చు .మాకేమో ఊరు కొత్త. స్టేషన్ లో రిపొర్టివ్వడాలు.... మీవారికి వీలైతే..
ఏయ్. ఏంటే అలా కంగారు పడి పోతావు. మేమిద్దరం బయలుదేరి వస్తున్నాం.
బజారు నించి వస్తూ..వాళ్ళింటికి వెళ్ళాం. ఇల్లంతా శ్మశాన వాతావరణం. పిల్లలకేమీ పెట్టినట్లు లేరు. మేంతెచ్చిన ప్రసాదాలు ఆబగా తినేసారు. మావారు, విజయ హస్బెండ్ బయటకి వెళ్ళిపోయారు.
విజయ వాళ్ళ పెద్దపాప తన్మయి చాల ఇంక్విసిటివ్. మెల్లగా నాదగ్గరకు వచ్చి చేరిపోయింది. ఆంటీ. పెళ్ళిళ్ళ గురించి నీకు బాగా తెలుసని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది.
ఇపుడు బాబాయి ఎవరిష్ఠం లేకుండా పెళ్ళి చేసుకుంటున్నాడు కదా. ఇదేం రకమయిన పెళ్ళి. వయసుకి మించిన ప్రశ్న అయినా చెప్పాలని అనిపించింది. క్లుప్తంగా చెప్పాను.

ఇదుగో అప్పుడే విషయాలన్నీ బ్లాగులో పెట్టాలన్న ఆలోచన వచ్చింది.

మన పూర్వీకులు వివిధ రకాల వివాహాలని ఒక పద్యం లో చక్కగా పొందు పరిచారు.

బ్రాహ్మాదైవస్తదైవార్ష:ప్రాజాపత్య:తధాసుర:

గాంధర్వో రాక్షస్తశ్చైవ పైశాచశ్చాష్టయో ధమ:

1.
బ్రాహ్మం 2. దైవం 3. ఆర్షం 4. ప్రాజాపత్యం

5.
అసురం 6. గాంధర్వం 7. రాక్షసం 8. పైశాచం.

1.
బ్రాహ్మం: సర్వ లక్షణ సంపన్నుడైన వరుని ఆహ్వానించి యధాశక్తిగా
అలంకరించిన
కన్యను అతనికి ఉదక పూర్వకంగా
దానం చేస్తే అది బ్రాహ్మ వివాహ మంటారు. ఇలా వివహం చేసుకున్న దంపతులకు పుట్టిన వాడు పదితరాలకు పితృదేవతలను, పదితరాల వరకూ పుత్రాదులను, పవిత్రులను చేస్తాడు.

2.
దైవం : యజ్ఞాన్ని చేసేటప్పుడు అక్కడ ఋత్విక్కుగా వున్న వరుడికి అలంకరించిన కన్యను దానం చేయడం దైవవివాహమంటారు. ఇలా పెండ్లి చేసుకున్న వారికి పుట్టినవాడు 7 తరాల ముందువారిని, 7 తరాల తరువాత వారిని కూడా తరింపజేస్తాడు.

3.
ఆర్షం : రెండు ఆవులను తీసుకుని కన్యాదానం చేస్తే అది ఆర్షవివాహ మౌతుంది. ఇలా పెండ్లి చేసుకున్న వారికి పుట్టిన వాడు ముందు మూడు తరాలను తర్వాత మూడు తరాలను తరింపజేస్తాడు.

4.
ప్రాజాపత్యం : " కలిసి ఉండి ధర్మాన్ని ఆచరించండి " అని ప్రతిజ్ఞ చేయించి కన్యాదానం చేస్తే అది ప్రజాపత్యమౌతుంది.
ఇలా పెండ్లయినవారికి పుట్టిన వారు ముందు 6 తరాలను, తరువాత 6 తరాలను తనను కూడా తరింపచేస్తాడు.

5.
అసురం : వరుని దగ్గర డబ్బు తీసుకుని కన్యాదానం చేస్తే అది అసుర వివాహం అవుతుంది.

6.
గాంధర్వం : పరస్పరానురాగాన్ననుసరించి రహస్యంగా చేసుకునేది గాంధర్వ వివాహం.

7.
రాక్షసం : యుధ్ధం చేసి కన్యనపహరించి చేసుకుంటె అది రాక్షస వివాహం అవుతుంది.

8.
పైశాచం : కన్యను మారువేషమ్లోనో, నిద్ర పోతూండగానో అపహరిస్తే అది పైశాచ వివాహమౌతుంది.
కొస మెరుపు:
ఘనా దేశం లో ఆసాంటే అను తెగవారిలో మగవాడు వధువు ఇంటి తలుపు తడతాడు. వరుని తల్లి ,అతని మేనమామ వధువు ఇంటి కి వెళ్ళి వివాహాన్ని పర్తిపాదిస్తారు.

వివాహ స్వరూపం ....మరో టపాలో...